శ్రీశాంత్ జీవిత కాల నిషేధం: బాధపడిన గంగూలీ
కేరళ పేసర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రికెటర్ శ్రీశాంత్ జీవిత కాల నిషేధంపై భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ లైఫ్ బ్యాన్ ఎదుర్కొంటున్నందుకు బాధగా ఉందని గంగూలీ వాపోయాడు. శ్రీశాంత్ తప్పు చేసి ఉంటే అది సరైన నిర్ణయమేనని చెప్పాడు.
శ్రీశాంత్కు ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉందన్నాడు. అతను తన ప్రతిభను వృథా చేసుకున్నాడని పేర్కొన్నాడు. కాగా, ఐపిఎల్ 6 ఎడిషన్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్పై జీవిత కాలం నిషేధం విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం బిసిసిఐ క్రమశిక్షణా సంఘం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తన జీవిత కాల నిషేధం పైన శ్రీశాంత్ కూడా స్పందించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో తన ప్రమేయం ఏమీ లేదని, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పాడు. బిసిసిఐ విధించిన జీవితకాల సస్పెన్షన్ను తన క్రీడాజీవితంలో ఎదురైన అతి పెద్ద సంఘటనగా అభివర్ణించాడు. తన తప్పేమీ లేదని, ఈ విషయం త్వరలోనే బయటపడుతుందని ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ పరిస్థితి తనకు ఎందుకు ఎదురైందో ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నాడు. సస్పెన్షన్ నిర్ణయం బాధా కరమని, తనను మానసిక వేదనకు గురి చేసిందని శ్రీశాంత్ చెప్పాడు. తొమ్మిది సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటికీ, తనకు ఎవరూ అండగా నిలవలేదని వాపోయాడు. ఈ ఆపత్కాలంలోనైనా అందరి మద్దతు తనకు లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పాడు.