వైరాగ్యంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా
చిక్కులు చుట్టుముట్టడంతో జీవితంమీద వైరాగ్యం పుట్టుకొచ్చిందో లేక జీవిత పరమార్థం తెలిసి వచ్చిందో తెలియదు గానీ ఉన్నట్టుండి వేదాంతం మాట్లాడుతున్నాడు. బుధవారం అతను ట్విట్టర్లో చేసిన ట్వీట్లను గమనిస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతుంది.
'జరిగేది జరుగుతుంది. దాన్ని మనం మార్చలేం. అలాగని పోరాడకుండా వదిలేస్తే ఏ సమస్యకూ పరిష్కారం దక్కదు' అంటూ ట్వీట్ చేసి తన వైరాగ్యాన్ని వెల్లబోసుకున్నాడు. అయితే, కుంద్రాకు రెండు రకాల ఊరట లభిస్తోంది.
కుంద్రా బెట్టింగుకు మాత్రమే పాల్పడ్డాడని, అతనికి స్పాట్ ఫిక్సింగ్తో సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం ఒక ఊరట కాగా, అతని వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయంకా మాట మార్చడం మరో ఊరట. కుంద్రా పేరు తన నోటి వెంట రాబట్టడానికి ఢిల్లీ పోలీసులు తనను వేధించారని ఉమేష్ గోయంకా అన్నారు. దీంతో కేసు తీరుతెన్నులు మారిపోయే పరిస్థితి వచ్చింది. ఏమైనా, కుంద్రా బయటపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.