పురంధేశ్వరిపై కావూరి వ్యూహం ఫలించిందా?
కావూరి సాంబశివ రావుతో పాటు కొద్ది మంది కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సోనియా గాంధీని కలిసి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లకూడదని సోనియా గాంధీకి నచ్చజెప్పారు. ఎన్టీ రామారావు తొలి నుంచి కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేశారని, కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేసిన ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు సోనియాకు చెప్పినట్లు సమాచారం. దాంతో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీకి సంబంధించి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ముఖ్యమైన నేతగా మారారు. అది కావూరి అవకాశాలను దెబ్బ తీస్తోంది. పురంధేశ్వరి మంత్రివర్గంలో ఉండడం వల్లనే తనకు అవకాశం లభించలేదనే అభిప్రాయం ఉంది. పురంధేశ్వరిని మంత్రివర్గం నుంచి తొలగించడానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంగీకరించలేదు. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన కావూరి సాంబశివరావుకు మంత్రివర్గంలో చోటు కల్పించడం సాధ్యం కాలేదు.
తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై కావూరి చాలా కాలం అలక వహించారు. పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే, ఆ తర్వాత కాలంలో ఇతరేతర కారణాల వల్ల మళ్లీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సోనియా గాంధీ వద్ద కావూరి సాంబశివ రావుకు మంచి పలుకుబడి ఉంది. ఈ స్థితిలో పురంధేశ్వరిని పోటీ నుంచి తొలగింపజేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే సోనియా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రాకుండా చూశారని అంటున్నారు.