అమ్మ సోనియా దయ: రాజ్యసభకు మళ్లీ కెవిపి?
తెలుగుదేశం పార్టీకి చెందిన హరికృష్ణ రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేయటం తెలసిందే. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్కు నాలుగు, తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు దక్కుతాయి. కాంగ్రెస్కు చెందిన ఐదుగురు సభ్యులకుగాను నలుగురు మాత్రమే తిరిగి ఎంపికయ్యేందుకు అవకాశం ఉంది. కాంగ్రెసు తరఫున ఎం.ఏ.ఖాన్, రామచందర్రావులను రెండోసారి రాజ్యసభకు పంపించే అవకాశాలున్నాయని సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం సూచించిన విధంగా ఖాన్ నడుచుకోవటం తెలిసిందే.
దీనితోపాటు ఆయన రాజ్యసభలో పార్టీ విప్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నందున ఖాన్కు రెండోసారి రాజ్యసభ సభ్యత్వం వరిస్తుందని చెబుతున్నారు. రామచంద్రారావు సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం నడిపించినా ఆయన కూడా పార్టీ అధినాయకత్వానికి విధేయుడుగా ఉండటం వలన అతన్ని కూడా మరోసారి రాజ్యసభకు పంపిస్తారని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.
టి.సుబ్బిరామిరెడ్డి ఈసారి విశాఖపట్నం నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. రత్నాభాయికి మరోసారి రాజ్యసభ టికెట్ కేటాయించని పక్షంలో ఆమె స్థానంలో మరో గిరిజన నాయకుడిని రాజ్యసభకు పంపించవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. నాలుగో సీటుకోసం వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక నాయకుడిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలిసింది.