జగన్ పార్టీ నుండి బావ: బాబుకు మోదుగుల షాక్
గుంటూరు: తెలుగుదేశం పార్టీలో గుంటూరు జిల్లా నరసారావుపేట లోకసభ నియోజకవర్గం టిక్కెట్ రసకందాయంలో పడింది. ప్రస్తుతం నరసారావుపేట నుండి టిడిపి నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, 2014 ఎన్నికల్లో మోదుగుల పోటీకి సుముఖత చూపడం లేదట.
ఈ విషయాన్ని ఆయన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి చెప్పినట్లుగా తెలుస్తోంది. మోదుగుల వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేట నుండి పోటీ చేయకపోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న ఆయన బావ కారణంగానే అంటున్నారు.
కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించిన అనంతరం రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డి ఆ పార్టీలో చేరారు. అయోధ్య రామిరెడ్డి నరసారావుపేట నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి నుండి పోటీ చేసేందుకు అయోధ్యకు వైయస్ జగన్ కూడా పచ్చజెండా ఊపారట.
జగన్ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్న అయోధ్య రామిరెడ్డి టిడిపి నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ. దీంతో బావ మీద పోటీ చేసేందుకు మోదుగుల ఇష్టపడటం లేదట. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి మోదుగుల తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
నరసారావుపేట నుండి మరోసారి మోదుగులనే పోటీ చేస్తే టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే, తన ప్రత్యర్థి బావ కావడంతో మోదుగుల పోటీకి విముఖత చూపుతున్న నేపథ్యంలో టిడిపి కొత్త అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తోంది.
ఎన్నారై చంద్రశేఖర్ నరసారావుపేట నుండి టిడిపి తరఫున బరిలో దిగే అవకాశాలున్నాయంటున్నారు. జగన్ పార్టీ తరఫున అయోధ్య రామిరెడ్డి బరిలోకి దిగితే ఆయన పైన టిడిపి తరఫున చంద్రశేఖర్ పోటీ చేసే అవకాశాలున్నాయి. చంద్రశేఖర్ సోమవారం చంద్రబాబును కలువనున్నారు.