జగన్తో పోటీ: టిడిపిలో అంతా నారా లోకేషే?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసుకు అంతా వైయస్ జగన్మోహన్ రెడ్డే. అతని మాట ప్రకారమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నడుస్తుంది. జగన్ను సంప్రదించకుండా పార్టీలో నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికీ లేదు. ఆ స్థాయి కోసం తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారట. చంద్రబాబు పాదయాత్రలో ఉన్నందువల్ల పార్టీలో నారా లోకేష్ ప్రధాన అధికార కేంద్రంగా మారినట్లు చెబుతున్నారు.
పార్టీలో నారా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారారని కొంత మంది పార్టీ నాయకులు నవ్వుతూ వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్కు తెలియకుండా పార్టీలో చీమ చిటుక్కుమన కూడదట. ప్రతి నిర్ణయం ఆయనను అడిగి తీసుకోవాల్సిందేనని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సరైన అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయనకు వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేదోడు వాదోడుగా ఉంటున్నారని అంటున్నారు.
తన వద్దకు ఎవరైనా వస్తే చంద్రబాబు నాయుడు కూడా నేరుగా లోకేష్ వద్దకు పంపుతున్నారని సమాచారం. జిల్లా స్థాయి వ్యవహారాలపై నిర్ణయాలను కూడా చంద్రబాబు తన తనయుడికే అప్పగిస్తున్నారట. పార్టీలో ప్రతి ఒక్కరూ తనను గౌరవించాలని, తన మాట వినాలని లోకేష్ ఆదేశిస్తున్నారట. దీంతో అందరూ లోకేష్ను చిన్నబాబు అనో, సర్ అనో సంబోధిస్తున్నారు. ఆ రకంగా పార్టీలో ఓ బ్యూరోక్రటిక్ కల్చర్ను ప్రవేశపెడుతున్నారని అంటున్నారు.
ఈ స్థితిలోనే పార్టీకి నిబద్ధుడిగా ఉంటూ క్రియాశీలకంగా పనిచేసిన దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని అంటున్నారు. ఓ వ్యాపారవేత్త కారణంగానే తనను తిరిగి శాసనమండిలికి నామినేట్ చేయలేదని దాడి వీరభద్రరావు మొత్తుకున్న విషయం తెలిసిందే. పరోక్షంగా ఆయన సిఎం రమేష్ను విమర్శించారని అంటున్నారు. తాను చంద్రబాబును కూడా కలవడం లేదని, తన ప్రమేయం ఏమీ లేదని రమేష్ సర్ది చెబుతున్నట్లు సమాచారం.