వార్త పంచ్: సాక్షిది తప్పన్న జగన్ పార్టీ నేత పిల్లి
జగన్ కోసం పదవులకు రాజీనామా చేశారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి... మాజీ అయ్యారు. మొదటి నుండి జగన్ పేరు తలుస్తూ.. ఆయన వెంటే ఉన్న పిల్లి సుభాష్... జగన్కే చెందిన సాక్షి పత్రిక తీరును తప్పు పట్టడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా బాలవరంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను కూడా జనం అడ్డుకున్నారు.
పోలీసుల లాఠీఛార్జీలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కూడా రెచ్చిపోయారు. ఈ ఘటనపై జగన్ పత్రిక సాక్షిలో రాలేదు. దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాకినాడలో పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. థర్మల్ ఆందోళనపై మిగిలిన అన్ని పత్రికలు చక్కగా విశ్లేషిస్తూ వార్తలు ఇచ్చాయని, ఈ పత్రికలో ఎందుకు రాలేదో తనకు అర్థం కావట్లేదని, ఇది తప్పని, దీన్ని తాను ఖండిస్తున్నానని, మీడియా గొంతులేని వారి గొంతుకగా ఉండాలని, రాజకీయం వేరు, వ్యాపారం వేరని ఆయన అన్నారు.
కాగా తూర్పు గోదావరి జిల్లా దొంతమూరు గ్రామంలో కొందరు యువకులు జగన్ దినపత్రిక ప్రతులను దహనం చేశారు. థర్మల్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలకడం లేదని మండిపడ్డారు. గ్రామంలో ఎవరూ ఈ పత్రికను చదవరాదని నినాదాలు చేశారు.