శ్రీశాంత్కు ఊరట: ద్విభాషా చిత్రంలో యాక్షన్
కొచ్చి: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న క్రికెటర్ శ్రీశాంత్ మొక్కులు ఫలించినట్లే ఉన్నాయి. పొర్లు దండాలకు దేవుళ్లు కరుణించినట్లే ఉన్నారు. అతనికి ఊరట కలిగించే సంఘటన చోటు చేసుకుంటోంది. ఆయనకు ఓ బడా ద్విభాషా చిత్రంలో నటించే అవకాశం తన్నుకుని వచ్చింది. పెళ్లి విషయంలో గర్ల్ ఫ్రెండ్ తోడు నిలువగా ఇప్పుడు ఈ అవకాశం మరింత అతనికి హాయినిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
తమిళం, మలయాళ భాషల్లో నిర్మించనున్న చిత్రానికి పి. బాలచంద్ర కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని బాలచంద్ర ధ్రువీకరించారు కూడా. ప్రకాష్ రాజ్, ప్రభు దేవా కూడా చిత్రంలో నటించడానికి అంగీకరించారని ఆయన చెప్పారు. చిత్రం షూటంగ్ ఇంగ్లాండు, దుబాయ్, చెన్నై, కొచ్చిల్లో జరుగుతుందని చెప్పారు.
తమిళ, మలయాళీ భాషల్లో నిర్మించే ఈ చిత్రం హిందీ వెర్షన్ కూడా రూపొందిస్తామని బాలచంద్ర చెప్పారు. చిత్ర కథ గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం ప్రభావం చిత్రంపై పడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేరళలోని ప్రసిద్ధ వ్యక్తుల్లో శ్రీశాంత్ ఒకడని, జైల్లో ఉన్నప్పటికీ సంజయ్ దత్ను ప్రజలు అభిమానిస్తున్నారని ఆయన అన్నారు. దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయని శ్రీశాంత్ కుటుంబ సభ్యులు చెప్పారు. పాస్పోర్టు, డాక్యుమెంట్లు కోర్టులో ఉన్న విషయంపై దర్శకుడితో మాట్లాడుతున్నట్లు వారు తెలిపారు.