'లెజెండ్ అయ్యేవాడు కాదు': కాంబ్లీకి సచిన్ నో?
సచిన్ వీడ్కోలు ప్రసంగంలో తన పేరును ప్రస్తావిస్తాడని అనుకున్నానని కానీ, అతను మాట మాత్రమైనా తన గురించిగానీ, తాము సాధించిన 664 పరుగుల భాగస్వామ్యాన్ని గురించి గానీ పేర్కోకపోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, సెయింట్ జేవియర్ పాఠశాలపై 1988 ఫిబ్రవరిలో జరిగిన హారిస్ షీల్ట్ మ్యాచ్లో తాము భారీ భాగస్వామ్యాన్ని సాధించామని, అదే తమ జీవితంలో కీలక ఘట్టమని పేర్కొన్నాడు.
ఆ ఇన్నింగ్స్ తర్వాత తమకు గుర్తింపు లభించడమేగాక, భారత జాతీయ జట్టులోనూ స్థానం లభించిందని 41 ఏళ్ల కాంబ్లి పేర్కొన్నాడు. వీడ్కోలు ప్రసంగంలో సచిన్ ఈ ప్రస్తావన తీసుకొస్తాడని, ఆ భాగస్వామ్యంలో తన పాత్ర కూడా ఉన్నద్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడని ఆశించానని అన్నాడు.
ఆ నాటి భారీ భాగస్వామ్యాన్ని సచిన్ ప్రస్తావించకపోవడం తనను అసంతృప్తికి గురి చేసిందన్నాడు. అంతేగాక, వీడ్కోలు విందుకు తనను పిలవలేదన్నాడు. తామిద్దరం కలిసి నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం తమ జీవితాల్నే మార్చేసిందని, అది లేకుండే తానిలా ఉండేవాడిని కాదని, సచిన్ కూడా క్రికెట్ లెజెండ్ అయ్యేవాడు కాదన్నాడు. అయినా తనకు సచిన్ పైన ఉన్న ప్రేమ తగ్గదని, ఎప్పుడు సచిన్ బాగుగోనే కోరుకుంటానని చెప్పాడు.
కాగా, 2009లో ఒక చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సచిన్ సాయం చేయగల స్థితిలో ఉన్నప్పటికీ తనను పట్టించుకోలేదని కాంబ్లి విమర్శించిన విషయం తెలిసిందే. అప్పట్లో అతని వ్యాఖ్యలు దుమారం రేపాయి.