రాహుల్ వదిలిన బాణాలు యాష్కీ, రేణుకా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు వ్యతిరేకంగా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వదిలిన బాణాలుగా మధు యాష్కీని, రేణుకా చౌదరిన వ్యాఖ్యానిస్తున్నారు. వీరిద్దరు కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దూకుడును కట్టడి చేయాలని రాహుల్ గాంధీ ప్లాన్ వేశారట.
నిజానికి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక్క సమయంలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించేందుకు సిద్ధపడ్డారట. దానికి రాహుల్ గాంధీ అడ్డుపడినట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయకుండానే తెలంగాణలో పాగా వేసే ప్లాన్ను ఆయన సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మధు యాష్కీని, రేణుకా చౌదరిని ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు.
మధు యాష్కీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కెవిపికి, కెసిఆర్కు సంబంధాలు అంటగడుతూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మొదట్లో తెలంగాణకు అత్యంత అనుకూలంగా మాట్లాడుతూ వచ్చిన యాష్కి క్రమంగా వెనక్కి తగ్గారనే మాట వినిపిస్తోంది. యాష్కీని ఓడించడానికి కెసిఆర్ స్వయంగా తన కూతురు కవితను నిజామాబాద్ పార్లమెంటు సిటీలో పోటీకి దింపేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా యాష్కీ అరికాలి మంట నెత్తికెక్కడానికి కారణమైందని అంటున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణలోని ఆత్మబలిదానాలపై రేణుకా చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. యాష్కీ తెరాసను టార్గెట్ చేసుకోగా, రేణుకా చౌదరి ఏకంగా ఉద్యమాన్నే లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. యువకులు అనారోగ్యంతో మరణించారని, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకోలేదని ఆమె వ్యాఖ్యానించి ఓ రాయి విసిరారు.
ఆ వ్యాఖ్య చేయడం ద్వారా తెలంగాణవాదుల రియాక్షన్ను తెలుసుకోవాలని ఆమె అనుకున్నారట. అయితే, తెలంగాణవాదులు రేణుకా చౌదరి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె ఇంటి వద్ద ధర్నాలకు దిగుతున్నారు. అయినా ఆమె నోరు విప్పడం లేదు. ఇదంతా రాహుల్ గాంధీ సూచన మేరకే రేణుకా చౌదరి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.