పురంధేశ్వరిపై బిజెపి సీరియస్: ఇంకా ఎవరైనా..
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటన బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై తాను ఆలోచిస్తున్నట్లు ఆమె చెప్పడం సంచలనం సృష్టించింది. ఆమె ప్రకటనను బిజెపి నాయకత్వం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దానికితోడు, పురంధేశ్వరి తన మనసులో బయపెట్టారని, అలా బయటపడని నాయకులు ఇంకా ఎవరైనా ఆ ఆలోచనలో ఉన్నారా అనేది కూడా ఇప్పుడు బిజెపి నాయకత్వం ఆలోచనలో పడింది.
రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరినప్పటికీ పురంధేశ్వరికి పోటీ చేయడానికి కోరుకున్న సీటు దొరకలేదు. ఆమె విశాఖపట్నం వదిలేసి రాజంపేటకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆమె ఓటమి పాలయ్యారు. గత కొంత కాలంగా ఏమీ మాట్లాడని పురంధేశ్వరి సమయం అనుకూలిస్తే టిడిపిలో చేరుతానని చెప్పారు.
పురంధేశ్వరి ప్రకటన బిజెపికి మింగుడు పడడం లేదు. అయితే, బిజెపి నాయకత్వాన్ని కాదని ఆమెను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారా అనేది ఓ ప్రశ్న. కాగా, కాంగ్రెసుకు రాజీనామా చేసిన మరో మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు మౌనంగా ఉంటున్నారు. ఆయన వంటి నాయకులు కూడా పురంధేశ్వరిలా ఆలోచన చేస్తున్నారా అనేది ఉప్పుడు బిజెపి నాయకత్వం ముందు సమస్య.
కాగా, పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ నాయకత్వం అధిష్టానానికి ఫిర్యాదు చేయడం లాంఛనమేనని అంటున్నారు. ఆమెపై బిజెపి నాయకత్వం చర్యలు తీసుకుంటుందా, ఆమె ఆలోచనను మార్చే ప్రయత్నం చేస్తుందా చూడాలి.