షేమ్: అండర్ వియర్లలో త్రివర్ణ పతాకలు
హైదరాబాద్: పోలీసుల కళ్లు గప్పడానికి ఇద్దరు బిజెపి కార్యకర్తలు త్రివర్ణ పతాకను అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ వింమోచన దినోత్సవం సందర్భంగా పోలీసుల కళ్లు గప్పి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురేయాలనే అత్యుత్సాహంతో వారు ఈ అవమానకరమైన సంఘటనకు పాల్పడ్డారు.
తమ ప్యాంట్లలోంచి తీసి జాతీయ పతాకలను ఎగురేయడానికి ప్రయత్నించిన ఇద్దరు బిజెపి కార్యకర్తలను హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. జాతీయ పతాకను అవమానించినందుకు రాహుల్ శర్మ, హరీష్ కుమార్ అనే ఇద్దరు బిజెపి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి బుధవారంనాడు నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురేయడానికి బిజెపికి పోలీసుల అనుమతి లభించకపోవడంతో బుధవారం ఆందోళనకు దిగారు.
బిజెపి నాయకులు బద్దం బాల్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. గోల్కొండ కోట వద్దకు చేరుకున్న బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మజ్లీస్ కారణంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు రావడం లేదని బిజెపి నాయకులు విమర్శించారు.