బాస్ గొడవ: మీడియాకు మొహం చాటేసిన ధోనీ
కార్డిఫ్: టెస్టు సిరీస్లో ఘోర వైఫల్యం చవి చూసిన ఇండియా క్రికెట్ను బాస్ వివాదం చిక్కుల్లో పడేసింది. డంకెన్ ఫ్లెచర్ విషయంలో కెప్టెన్ ధోనీకి, బిసిసిఐ అధికారులకు మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇంగ్లాండుతో రెండో వన్డే మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మీడియాకు మొహం చాటేసింది.
మ్యాచ్కు ముందు జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. కానీ తాజా వివాదంతో ఏ క్రికెటర్ కూడా మీడియా ముందుకు రాలేదు. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ బాస్గా ఉంటాడంటూ ధోనీ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది. టీమిండియా కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ కూడా మీడియాకు మొహం చాటేయడం చర్చనీయాంశంగా మారింది.
ధోనీ ఆ ప్రకటన ద్వారా తన హద్దులను దాటాడని బిసిసిఐ అభిప్రాయపడింది. ఈ వివాదంపై తదుపరి వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలని బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. జట్టు యాజమాన్యం మీడియా సమావేశానికి హాజరు కావాలని ఏ ఒక్క ఆటగాడికి కూడా చెప్పలేదు. దాంతో మీడియా సమావేశం జరగలేదు.
రవిశాస్త్రి జట్టు డైరెక్టర్గా నియమితులైన నేపథ్యంలో బాస్ ఎవరనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే జట్టు యాజమాన్యం మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో రవిశాస్త్రి, ఫ్లెచర్ ఇద్దరూ ఉన్నారు. కానీ మీడియా సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు.