రోడ్డుపై మాజీ ఎంపి పాస్పోర్టు, నగదు చోరీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథాన్ని హైదరాబాదులోని ఆబిడ్స్లో ఇద్దరు దొంగలు దోచుకున్నారు. ఆయన పాస్పోర్టును, ఇతర పత్రాలను, 90 వేల రూపాయల నగదును దోచుకున్నారు. సోమవారంనాడు ఈ సంఘటన జరిగింది.
షాపింగ్ సెంటర్ వద్ద ఆగి ఉన్న కారులో కూర్చున్న మందా జగన్నాథం కారు డ్రైవర్ దృష్టిని దొంగలు మళ్లించారు. రోడ్డు మీద పది రూపాయల నోట్లను పడేసి వాటిని డ్రైవర్కు చూపించి కారు వెనక సీట్ల ఉన్న బ్రీఫ్కేసును ఎత్తుకెళ్లారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై తన వద్దకు వచ్చారని, కింద పడిన పది రూపాయల నోట్లను తనకు చూపించి తన దృష్టి మళ్లించారని డ్రైవర్ శ్రీనివాస రెడ్డి చెప్పారు.
డ్రైవర్ దిగి ఆ నోట్లను తీసుకుంటుండగా దొంగల్లో ఒకతను కారు వెనక డోర్ తెరిచి బ్రీఫ్కేసు తీసుకుని పారిపోయినట్లు ఆబిడ్స్ రోడ్డు పోలీసు స్టేషన్ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. డ్రైవర్ వారి వెంట పడినప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ పని స్థానిక ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా కెమెరాల్లో ఏమైనా ఈ సంఘటన చిత్రతమైందేమోనని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.