ముఖ్యమంత్రి విమానాన్ని చేతులేసి తోసుకొచ్చారు
చిండ్వారా (మధ్యప్రదేశ్): ఇంజన్ మొరాయిస్తే కార్లు, బైక్లు, బస్సులు, లారీలు స్టార్ట్ చేయ్యేసి తోయడం అనుభవంలో ఉన్నదే. అయితే, తాజాగా విమానాలకూ ఈ ఇబ్బంది తప్పనట్లు అనిపిస్తోంది. విమానానికేం ఢోకా లేదు కానీ సమస్యల్లా పార్కింగ్ కారణంగానే తలెత్తింది.
విషయమేంటంటే.. చిండ్వారాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమానంలో వచ్చారు. ఆ తర్వాత కొంతసేపటికి ఎంపీ కమల్నాథ్ ప్రత్యేక విమానంలో చిండ్వారా వస్తున్నారన్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి విమానాన్ని పక్కకు జరిపారు.
ముఖ్యమంత్రి తిరిగి బయలుదేరే సమయంలో విమానాన్ని రన్వే మీదికి చేర్చేందుకు ఆయన భద్రతా సిబ్బంది తోశారు. ఆ సంఘటన సోమవారంనాడు జరిగింది. నిజానికి, కమల్నాథ్ ప్రయాణిస్తున్న విమానం అంతకన్నా ముందు రావాల్సింది. కానీ జాప్యం జరిగింది. దీంతో చౌహాన్ విమానానికి పార్కింగ్ సమస్య తప్పలేదు.
చౌహాన్ విమానాన్ని పోలీసులు, ఇతర సిబ్బంది దాదాపు 15 - 20 అడుగుల దూరం తోసుకుంటూ జరిపారు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఆ ఎయిర్ స్ట్రిప్ను వాడుతారు. ఈ ఎయిర్ స్ట్రిప్ను నాగపూర్ ఎటిసి నిర్వహిస్తుంది.