భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని సుష్మా, మండిపడ్డ మమత
న్యూఢిల్లీ: భగవద్గీతను జాతీయ పవిత్రగ్రంథంగా ప్రకటించాలని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భగవద్గీత 5151వ జయంతి వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన గీతా ప్రేరణ మహోత్సవ్లో మాట్లాడిన సుష్మా పైవ్యాఖ్యలు చేశారు.
భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని గట్టిగా కోరిన ఆమె, ఈ విషయంలో ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడ్డం ఒక్కటే మిగిలి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని వీహెచ్పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ కోరారు.
సుష్మా మాట్లాడుతూ.. విదేశాంగ మంత్రిగా తాను పలు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నానంటే అది కేవలం భగవద్గీత ప్రబోధాల మూలంగా మాత్రమే అన్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షులు బరాక్ ఒబామాకు భగవద్గీతను బహుమతిగా ఇచ్చినప్పుడే ఆ గ్రంథానికి జాతీయ పవిత్రగ్రంథం హోదా దక్కినట్లే అన్నారు. ఆ గ్రంథాన్ని చక్కగా చదివితే కుంగుబాటు సమస్యకు ఇట్టే పరిష్కారాలు స్ఫురిస్తాయన్నారు.
ప్రతి ఒక్కరి సమస్యకు భగవద్గీతలో పరిష్కారం ఉందని, అందుకే భగవద్గీతను రాష్ట్రీయ గ్రంథంగా ప్రకటించాలని తాను పార్లమెంటులో అన్నానని ఆమె చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ దీనికి సంబందించిన అధికార ప్రకటన చేయలేదన్నారు.
దీనిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఒక్కటే పవిత్ర గ్రంథమన్నారు. తాము అన్ని పవిత్ర గ్రంథాలను గౌరవిస్తామని ట్విట్టర్లో పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఒక్కటే పవిత్రగ్రంథమంటూ, భగవద్గీత, ఖురాన్, బైబిల్ సహా అన్ని మతాల పవిత్ర గ్రంథాలను తాము గౌరవిస్తామన్నారు. సుష్మ ప్రకటనను చౌకబారు ప్రకటనగా కాంగ్రెస్ అభివర్ణించింది. గీత గొప్పదనమంతా దాని సారంలోనే ఉందని, గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారెవరూ ఇలాంటి ప్రకటనలు చేయరని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు.