బాబు, కేసీఆర్లకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ ఝలక్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఝలకిచ్చారు! రుణమాఫీతో లాభం లేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ వంటి పథకాలు రైతులకు సులభంగా రుణాలు అందకుండా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ఈ మాఫీ వంటి పథకాలతో ఎలాంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు.
కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో రుణ మాఫీ పథకాలను అమలు చేశారని, ఈ రుణ మాఫీ పథకాలు ఎంత వరకూ ప్రభావం చూపాయి? రుణ మాఫీకి సంబంధించి తమ దగ్గర కొన్ని అధ్యయనాలు ఉన్నాయని, రుణ మాఫీతో ఎటువంటి ప్రయోజనం లేవని అవి తేల్చాయని, నిజం చెప్పాలంటే, రుణ మాఫీ పథకాన్ని అమలు చేసిన తర్వాత రైతుకు అసలు రుణం దొరకకుండా అవి అడ్డు పడుతున్నాయన్నారు.
రైతు ఆత్మహత్యలు చాలా సున్నితమైన అంశమన్నారు. ఈ విషయంపై లోతైన అధ్యయనం జరగాలన్నారు. వ్యవసాయ రంగంలో అధిక రుణగ్రస్తతను నివారించడమెలా అన్న అంశంపై అందరూ లోతుగా ఆలోచించాలని, రైతు రుణగ్రస్థతలో సాంప్రదాయక బ్యాంకింగ్ వ్యవస్థ పాత్ర ఎంత, రుణగ్రస్థత నుంచి సాంప్రదాయిక వ్యవస్థ ఏమేర ఉపశమనం కలిగిస్తుంది అన్న అంశాలపై విస్తృత చర్చ జరగాలన్నారు.
భారత ఆర్థిక సంఘాల వార్షిక సమావేశం శనివారం ఉదయ్పూర్లో జరిగింది. ఈ సందర్భంగా రఘురామ్ రాజన్ మాట్లాడారు. కాగా, ఫైలిన్ తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు రుణమాఫీ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా మాఫీ చేసిన రుణాల్లో తొలి విడతగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 శాతాన్ని బ్యాంకులకు చెల్లించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాలు 1.3 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా.