చిరు 150వ సినిమాపై గవర్నర్ ఆరా, చెర్రీ ఛాన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 150వ సినిమాపై ఆరా తీశారట. ఎపిసిసి నాయకులతో కలిసి బుధవారం చిరంజీవి వినతి పత్రం ఇచ్చేందుకు రాజ్ భవన్ వెళ్లారు. ఈ సమయంలో గవర్నర్ చిరును 150వ సినిమా పైన ప్రశ్నించారట.
గవర్నర్ తన 150వ సినిమా పైన అడగడంతో చిరంజీవి స్పందిస్తూ... ఆ సన్నాహాల్లో ఉన్నట్లు చెప్పారట. దర్శకులు మణిరత్నం, ఆయన భార్య సుహాసినిలు వచ్చి కలిశారని, కమల్ హాసన్ చేసిన నాయకుడు తరహాలో ఓ పాత్రను పోషిస్తే బాగుంటుందని మణిరత్నం చెప్పారని తెలియజేశారట.
చిరంజీవి నటించనున్న 150వ చిత్రంలో ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, మేనల్లుడు స్టైలిష్ హీరో అల్లు అర్జున్లు నటించే అవకాశాలున్నాయని సమాచారం. వారిద్దరు ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు.
కాగా, చిరంజీవి 150వ సినిమా పైన గత కొంతకాలంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి వరకు ఆయన కేంద్రమంత్రిగా బిజీగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి గెలవడంతో చిరంజీవికి ప్రస్తుతానికి విశ్రాంతి దొరికిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో త్వరలో ఆయన 150వ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు.