తాడిపత్రి రుచి: పరిటాల సునీతకు జెసి డిష్యూం
అనంతపురం: పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతకు అనంతపురం జిల్లాలో అన్న క్యాంటీన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ తాడిపత్రి శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి షాక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు కనపిస్తున్నారు. జెసి సోదరులతో పరిటాల సునీతకు మొదటి నుంచీ రాజకీయ వైరం ఉంది. అయితే, చంద్రబాబు నాయుడు పరిటాల సునీతకు నచ్చజెప్పి వారిని పార్టీలోకి తీసుకున్నారు.
తాము 2007 నుంచి తాడిపత్రిలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నామని, ఒకసారి తాడిపత్రికి వచ్చి అక్కడి మధ్యాహ్న భోజనాన్నిరుచి చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందని జేసీ తెలిపారు. అన్న క్యాంటీన్లతో ఉపయోగమేముందని, అన్న క్యాంటీన్లు అవసరమేనా అంటూ జేసీ ప్రశ్నించారు
అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, జెసి సోదరుల మధ్య రాజకీయ వైరం నిత్యం కొనసాగుతూ ఉండేది. ఈ స్థితిలో పరిటాల సునీత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్ల విషయంలో జెసి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో హడావిడిగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఏమిటో అర్థం కావడం లేదని జెసి ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
తమిళనాడు అమ్మ క్యాంటీన్లోని భోజనాన్ని రుచి చూసి ఇక్కడ అటువంటి పథకం అమలు చేయడం ఏమిటని, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొన్ని పథకాలు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అలాంటి పథకాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఒకటని ఆయన అన్నారు.