కెసిఆర్ అరవై జతల దుస్తులు కొన్నారట
హైదరాబాద్: మీడియాలో బుధవారం గమ్మత్తయిన వార్త వచ్చింది. ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు 60 జతల తెల్ల దుస్తులు కొన్నారట. ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండి, ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కొత్త ఎత్తులు వేసే కెసిఆర్కు కొత్త దుస్తులపై మోజు పుట్టిందట.
రాజకీయ వ్యవహారాలను పక్కన పెట్టి ఆయన ఇటీవల హైదరాబాదులోని ఓ ఖాదీ దుకాణానికి అనుచరగణంతో వెళ్లారట. ఆయన ఎప్పుడైనా దుస్తులను ఈ దుకాణంలోనే కొంటారట. ఇటీవల దుకాణానికి వచ్చిన కెసిఆర్ పనివాళ్లతో ముచ్చట పెడుతూ ఏకంగా 60 జతల దుస్తులను మూట కట్టించారట.
కొన్ని నెలల క్రితం ఆయన 80 జతల తెల్ల దుస్తులు కొన్నారని ఈ వార్తాపత్రిక రాసింది. ఇన్ని దుస్తులు ఆయన ఏం చేసుకుంటారు, ఎన్నాళ్లు వాడుతారనే సందేహం రావచ్చు. ఆయన కొన్ని దుస్తులను ఇంట్లోనూ, మరికొన్ని దుస్తులను ఫామ్హౌస్లోనూ ఉంచుతారట. ఎక్కడికి వెళ్లినా వెతుక్కునే సమస్య లేకుండా ఆయన ఒకేసారి దుస్తులు కొని అక్కడక్కడ పెడుతారట.
కాగా, కెసిఆర్ ప్రచారంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పంథాను అనుసరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఆయన ప్రచార సభలకు త్రిడీ హంగులు అద్దుతున్నారట.