చంద్రబాబు, జెపి మధ్య మల్కాజిగిరి కిరికిరి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, లోకసత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు మధ్య మల్కాజిగిరి లోకసభ సీటే కిరికిరిగా మారినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి స్థానం నుంచి తాను పోటీ చేసి తీరుతానని చెప్పి జయప్రకాష్ నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు చంద్రబాబు స్నేహం చేసుకోవడానికి జెపికి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.
ఇరువురి మధ్య సోమవారం సంప్రదింపులు జరిగినట్లు చెబుతున్నారు. అయితే, అవి కొలిక్కి రాలేదని అంటున్నారు. గత ఎన్నికల్లో లోకసత్తా చీల్చిన ఓట్ల కారణంగానే తాము ఓటమి పాలయ్యామనే అంచనాకు వచ్చిన చంద్రబాబు ఆ పార్టీని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి, జెపి కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారు. అయితే, మల్కాజిగిరి సీటును మాత్రం వదిలేదని లేదని అంటున్నారు.
పొత్తుల విషయంలో బిజెపి, తెలుగుదేశం పార్టీలు అనుసరించిన తీరు పట్ల జయప్రకాష్ నారాయణ తీవ్ర ఆవేదనతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని బహిరంగంగా పలుమార్లు ప్రకటించినా పట్టించుకోనట్లు వ్యవహరించారని ఆయన అంటున్నట్లు తెలిసింది.
కాగా, మల్కాజిగిరి సీటుకు తీవ్రమైన పోటీ ఉంది. సీమాంధ్ర నాయకులు దానిపై కన్నువేయగా, తెలంగాణ నేతలు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడూ విధేయుడూ అయిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి సీటు కోసం తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఏమైనా, జెపి పంతం నెగ్గుతుందో, రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తారో చూడాలి.