నందీశ్వర్ యూటర్న్: కెసిఆర్కు తొలి ఎదురుదెబ్బ
హైదరాబాద్: వలసల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తొలి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలోకి వస్తానని చెప్పిన కాంగ్రెసు పటాన్చెర్వు శాసనసభ్యుడు నందీశ్వర్ గౌడ్ యూటర్న్ తీసుకున్నారు. పార్టీలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఫాంహౌస్లో కెసిఆర్ను కలిసి తెరాసలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల నందీశ్వర్ గౌడ్ చెప్పారు.
నందీశ్వర్ గౌడ్ను నిలువరించడానికి తెలంగాణ కాంగ్రెసు నేతలు విస్తృత ప్రయత్నాలు చేశారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా ఫోన్ చేయించారు. రాయబారాలు ఫలించి ఆయనను కాంగ్రెసులో ఉంచుకోగలిగారు. నందీశ్వర్ గౌడ్తో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ చర్చలు జరిపారు.
ఆ నేపథ్యంలో నందీశ్వర్ గౌడ్ సోమవారం పొన్నాల లక్ష్మయ్యను కలిసి పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. తాను కాంగ్రెసుకు నిజాయితీ గల సైనికుడినని, 30 ఏళ్లుగా కాంగ్రెసులో ఉన్నానని, కొంత మంది చర్యల వల్ల తాను అసంతృప్తికి గురయ్యానని నందీశ్వర్ గౌడ్ చెప్పారు.
స్థానికంగా కాంగ్రెసు పరిస్థితి బాగా లేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని భావించి ఆయన తెరాసలోకి వెళ్లాలని నందీశ్వర్ గౌడ్ నిర్ణయించుకున్నారు.