నిర్భయ-పర్యాటకం: జైట్లీ 'చిన్న' పొరపాటు, వివరణ
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ చిన్న సంఘటన కారణంగా పర్యాటక రంగం భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన నిర్భయ సంఘటనను ఉద్దేశించి అన్నారు. నిర్భయ సామూహిక అత్యాచారం సంఘటన పర్యాటక రంగం పైన పడిందన్నారు.
ఈ వ్యాఖ్యల పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పర్యాటక మంత్రుల సమావేశం సందర్భంగా జైట్లీ నోరు జారారు. ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో కనిపించిన నిర్భయ లాంటి చిన్న ఘటనల నేపథ్యంలో పర్యాటక రంగం భారీగా నష్టాలను చవి చూస్తోందని, కేంద్రంతో పాటు రాష్ట్రాల ఖజానాకు భారీ నిధులను ఆర్జించిపెడుతున్న పర్యాటక రంగం ప్రస్తుతం అతి స్వల్ప పర్యాటకులతో తక్కువ రాబడులకే పరిమితమైందని జైట్లీ గురువారం అన్నారు.
దీంతో, ఆయన వ్యాఖ్యల పైన తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆయన తాను వ్యాఖ్యానించిన 'చిన్న' పైన వివరణ ఇచ్చారు. తన ఉద్దేశ్యాన్ని పొరపాటుగా అన్వయించారని శుక్రవారం వివరణ ఇచ్చారు.
తాను ఒక్క నిర్భయ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఇన్ జనరల్గా అన్న మాటను ఒక్క సంఘటనకు ఆపాదించడం సరికాదన్నారు. తానెప్పుడూ మహిళల సమస్యల పట్ల సున్నిత హృదయంతో స్పందిస్తానని చెప్పారు. మహిళల పైన నేరాలను క్షమించనన్నారు. కాగా, ప్రభుత్వ రికార్డుల్లో జైట్లీ ప్రసంగ పాఠం నుండి 'చిన్న' అన్న పదాన్ని తొలగించారు.