కేసీఆర్ను ఒప్పించి చేయకుంటే, పేరు మార్చుకుంటానని తెరాస మహిళా నేత సవాల్!
మెదక్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఒప్పించి మెదక్ను జిల్లా కేంద్రం చేయకుంటే తన పేరు పద్మ కాదని డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సవాల్ చేశారట. మెదక్ను జిల్లా కేంద్రంగా మార్చలేకుంటే తన పేరును మార్చుకుంటానని ఆమె అంటున్నారట.
తాను జిల్లా హెడ్ క్వార్టర్పై జరుగుతున్న దీక్ష శిబిరానికి మంచి మనస్సుతో వెళ్తే కొన్ని పార్టీల వారు అక్కడ తనను మాట్లాడకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. కొందరు నేతలు ప్రజలను తప్పు దారిలో నడిపించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మెదక్లో జిల్లా కేంద్రం ఏర్పాటవుతుందని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
శనివారం ఆమె మెదక్ ఏరియా ఆస్పత్రి సమీక్షకు వచ్చిన ఆమె కాన్వాయ్ను జిల్లా సాధన సమితి నేతలు అడ్డుకునే యత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడారు.
కేసీఆర్ హామీ మేరకు మెదక్లో జిల్లా కేంద్రం ఏర్పాటవుతుందని చెప్పిన ఆమె, దిష్టిబొమ్మలు తగలబెడితే ఏం లాభమని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతుండగా ఉద్యమకారులు గందరగోళాన్ని సృష్టించడంతో ఆమె అక్కడి నుంచి వెల్లిపోయారు. అనంతరం ఉద్యమకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకోకు దిగారు.
అంతకుముందు ఆమె మాట్లాడూతూ.. మెదక్ జిల్లా ప్రజల రాకపోకలు సులభతరమయ్యేందుకు మంజీరా నదిపై వంతెన నిర్మాణానికి రూ.36 కోట్లు మంజూరు చేయించినట్లు పద్మా దేవేందర్రెడ్డి చెప్పారు. శనివారం ఆసరా పింఛన్ల పంపిణీ కోసం పాపన్నపేటకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నుంచి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డికి, ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్లాలన్నా అక్కడి ప్రజలు ఇక్కడికి రావాలన్నా సుమారు 100 కిలో మీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు. అయితే పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామ పంచాయితీలోని ముద్దాపూర్, నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేట మండలం ఎంకంపల్లి గ్రామాల శివారు మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మంజీరా నదిపై రూ.36 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం త్వరలో చేపడతామన్నారు.
ఈ వంతెన పూర్తయిన తర్వాత రెండు జిల్లాల్లోని సుమారు 40 మండలాల ప్రజలకు ప్రయాణం సులభం అవుతుందన్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెల్లిన వెనువెంటనే రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులతో చర్చించి తక్షణమే నిధులు మంజూరు చేసినట్లు ఆమె వివరించారు.
ఈ రెండు జిల్లాల ప్రజలు బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వాలకు విజ్ఙప్తి చేసుకున్నా వారు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చీరాగానే ప్రజలకు మేలు కోరే పనులు చేస్తోందనడానికి ఈ బ్రిడ్జి నిర్మాణమే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు.