దేశంలోనే: ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి గెలిచారు
కర్నూలు: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో తొలిసారి గమ్మత్తయిన పరిస్థితి ఎదురైంది. అళ్లగడ్డ శాసనసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి విజయం సాధించారు. పోలింగ్కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. మరణించిన తర్వాత కూడా ప్రజలు ఆమెను గెలిపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రిజిష్టరైనప్పటికీ, దానికి ఎన్నికల కమిషన్ గుర్తింపు రాలేదు. దాంతో శోభానాగిరెడ్డి మరణించినప్పటికీ ఎన్నిక రద్దు కాలేదు.
ఎన్నికను వాయిదా వేయకపోవడమే కాకుండా ఇవియం నుంచి శోభానాగిరెడ్డి పేరును కూడా తీసేయలేదు. టిడిపి అభ్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆమె 16,747 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శోభా నాగిరెడ్డి మరణించిన తర్వాత ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు ఆమె కోసం ప్రచారం సాగించింది. శోభానాగిరెడ్డి కూతురు కూడా ప్రచారం చేశారు.
శోభానాగి రెడ్డి భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి వైయస్సార్ కాగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో నాగిరెడ్డి కుటుంబానిదే ప్రాబల్యం. శోభా నాగిరెడ్డి అంత్యక్రియలకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు .
మరణించిన శోభా నాగిరెడ్డి విజయం సాధించడంతో ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అప్పుడు భూమా నాగిరెడ్డి కుటుంబం నుంచే వైయస్సార్ కాంగ్రెసు నుంచి పోటీకి దిగే అవకాశాలంటాయి.