కాంగ్రెస్ ఆందోళనలో రాష్ట్రపతి కూతురు షర్మిష్ఠ
దేశ రాజధానిలో విద్యుత్తు కోతల పైన శనివారం కాంగ్రెసు పార్టీ చేపట్టిన నిరసనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠా ముఖర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను కాంగ్రెసు పార్టీలో భాగస్వామినేనని చెప్పారు. గత పదిహేనేళ్లుగా ఈ స్థాయిలో విద్యుత్తు కోతలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
అందుకే ఢిల్లీ నగర పౌరురాలిగా ఈ ఆందోళనకు మద్దతు తెలపడం తన బాధ్యత అన్నారు. ఆందోళనను హక్కుగా కూడా భావిస్తున్నానని చెప్పారు. ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న నీరు, విద్యుత్తు సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, ఢిల్లీలో విద్యుత్తు కోతల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో షర్మిష్ఠా ముఖర్జీ పాల్గొన్నారు. దేశ రాజధానిలోని విద్యుత్తు కోతల పైన బిజెపి ప్రభుత్వం సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.