ప్యాక్షనిస్ట్: రవీంద్రనాథ్ రెడ్డికి సభాహక్కుల నోటీసు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, ఆ పార్టీ శాసన సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభాపతి కోడెల శివప్రసాద రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
రవీంద్రనాథ్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగితపు వెంకట్రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఆదివారం కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నోటీసు ఇచ్చారు. కడప జిల్లాలో ఓ సమావేశంలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సభాపతిని ఫ్యాక్షనిస్టుగా అభివర్ణించారు. కాగా నోటీసును సభాపతి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు.
కాగా, సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ బాపు మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయంలో నకిలీ మద్యం, ఉచిత విద్యుత్ పైన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య వాదనలు జరిగాయి.