సచిన్పై కట్జూ అభ్యంతరక వ్యాఖ్యలు: శివసేన చురక
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ‘భారతరత్న' ఇవ్వడంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. కట్జూ హయాంలో మీడియా వాచ్డాగ్గా ఏం చేశారో చెప్పాలని మంగళవారం శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ప్రశ్నించింది.
‘సచిన్, రేఖలను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తే వారు చేసింది సున్నా. సచిన్కు భారత రత్న, రేఖను ఎంపీగా చేయడం దేశానికే అవమానం' అని కట్జూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో శివసేన కట్జూపై ధ్వజమెత్తింది. ‘రిటైరైనా కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. కౌన్సిల్ చైర్మన్గా మీరేం గొప్పపనులు చేశారో చెప్పండ'ని ఆయనను శివసేన ప్రశ్నించింది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్, సచిన్లకు ఒకేసారి భారత రత్న ఇవ్వాల్సింది, కానీ అప్పుడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తప్పు చేసిందని పేర్కొంది.
కానీ, కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ విషయంపై కట్జూకు కడుపునొప్పి రావడం మాత్రం ఆసక్తికరంగా ఉందని సామ్నా సంపాదకీయం పేర్కొంది. ఎటువంటి గొప్ప కార్యాలు చేయకుండానే రాష్ట్రస్థాయి నాయకులకు భారత రత్న ఇవ్వడం దేశానికి అవమానం కాదా? అలాంటిది సచిన్కు ఇవ్వడంలో తలవంపులేంటని సామ్నా ప్రశ్నించింది.