ఏపీలాంటి విభజనను చరిత్రలో చూడలేదన్న కమిటీ
హైదరాబాద్: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని ఏపీ రాజధానిపై వేసిన శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. శనివారం కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చరిత్రలో ఎన్నడు చూడని విభజన ఇది అన్నారు.
జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ను అందరూ కోరుకున్నారని, అవి ఏర్పడిన తీరు వేరని చెప్పారు. కానీ, ఇక్కడ జరిగిన తీరు వేరు అన్నారు. మిగతా రాష్ట్రాలు ప్రజల కోరికతో విడిపోయాయని చెప్పారు. కానీ తాజా విభజన వెనుక పెద్ద నేపథ్యం ఉందన్నారు. దాదాపు అన్ని కార్యాలయాలు, ప్రతి భవనం వివాద కేంద్రంలో ఉందన్నారు.
ఒంగోలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం, విజయనగరంలలో తమ కమిటీ పర్యటించాల్సి ఉందన్నారు. తాగు, సాగునీరు కావాలని, రాయలసీమను ఒక జోన్గా అభివృద్ధి చేయాలని అక్కడి నేతలు సూచించారు. శ్రీకాళహస్తి- నడికుడి రైల్వే లైన్ను అభివృద్ధి చేస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాలతో లింక్ ఏర్పడుతుందన్నారు. దీన్ని కోస్తాకు కూడా విస్తరిస్తే పోర్టుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు నీళ్లు చాలా ముఖ్యమని, ఈ సమస్యకు పరిష్కారాన్ని ప్రభుత్వానికి సూచించామన్నారు. రాజధాని గురించి విలేకరులు పదేపదే ప్రశ్నించడంతో.. ఇస్లామాబాద్, గాంధీనగర్, చండీగడ్, భవనేశ్వర్, పుత్రజయ, కాన్ బెర్రాల గురించి వారు తెలిపారు. ఇక్కడ ప్రతి చోటా రాజధానికి అనుబంధంగా మరో నగరం నిర్మితమైందన్నారు.
భువనేశ్వర్కు కటక్, గాంధీనగర్కు అహ్మదాబాద్, ఇస్లామాబాద్తకు రావల్పిండిలు చేయూతగా ఉన్నాయన్నారు. ఆర్కిటెక్చరల్ అద్భుతంగా చెప్పుకునే బ్రెజీలియాలో కంటే దాని వెలువలే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారన్నారు. కౌలాలంపూర్ మలేషియా రాజధానిగా కొనసాగుతున్న పుత్రజయలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయన్నారు. ఇవి అతిముఖ్యమైన పాఠాలు అన్నారు. భువనేశ్వర్ తరహా రాజధాని ఏపీకి సరిపోతుందని అభిప్రాయపడ్డారు.