బాబుకు షాక్?: తలసాని రాలేదు, కృష్ణయ్య నిలదీత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధినేత చంద్రబాబు నాయుడుకు షాకివ్వనున్నారా, అలాగే, బీసీ నేత, పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా ఝలక్ ఇస్తున్నారా! అంటే కావొచ్చునంటున్నారు.
శనివారం టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి సనత్నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ గైర్జాజరుకావడం చర్చనీయాంశమైంది. ఆయనతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. ఆయన తెరాసలో చేరుతున్నారని ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల బోనాల జాతర సమయంలోను ఆయన కేసీఆర్తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆయన టీటీడీపీకి దూరంగా జరుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదని మరికొందరు పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఫీజు రీయింబర్స్మెంట్కు సంబందించిన ఓ సమావేశంలో పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
అయితే, ఆర్ కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెబుతారని గతంలో ప్రచారం సాగింది. అందులో నిజమెంతో తెలియనప్పటికీ.. శనివారం ఫీజు రీయింబర్సుమెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణయ్య.. ఏపీ సీఎం అయిన తమ పార్టీ అధినేత తీరును ఒకింత తప్పు పట్టారు. 58, 42 పర్సెంట్ ప్రకారం ఏపీ, టీఎస్ రాష్ట్రాలు ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించాలన్న చంద్రబాబు ప్రతిపాదన సరికాదని ఆర్ కృష్ణయ్య బాంబు పేల్చారు.