ఎపి రాజధానిపై టెండూల్కర్ వాకబు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాస్టర్ బ్లాస్టర్, పార్లమెంటు సభ్యుడు, భారత రత్న సచిన్ టెండూల్కర్ వాకబు చేసినట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడ నగరం గురించి కూడా ఆయన ఆరా తీశారని చెబుతున్నారు. విజయవాడ నగరంలో శుక్రవారం పివిపి మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ వచ్చిన విషయం తెలిసిందే.
తాను ఇరవై ఏళ్ల కిందట క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చానని టెండూల్కర్ చెబుతూ విజయవాడకు సంబంధించి అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాను గమనిస్తూ టెండూల్కర్ పివిపిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాతి పరిస్థితులపై, కొత్త రాజధానిపై ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో సచిన్ పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే. విజయవాడ, గుంటూరు మధ్యనే ఎపి రాజధాని ఏర్పాటవుతుందని ప్రచారం జోరు అందుకోవడంతో ఇక్కడ భూములు కొన్నాడని ప్రచారం సాగింది.
అయితే, సచిన్ టెండూల్కర్ సన్నిహితులు మాత్రం ఆ వార్తలను కొట్టి పారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచిన్ టెండూల్కర్ సెంటు భూమి కూడా కొనలేదని వారు చెప్పారు. భూముల ధరలను పెంచడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ విధమైన ఊహాగానలకు ప్రాణం పోశారని అన్నారు. సచిన్ టెండూల్కర్ మాత్రం ఆ వార్తలపై నోరు మెదపలేదు.