మాట వినని పైలట్: పొన్నాలకు అవమానం
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (టిపిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అవమానం జరిగింది. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నట్లు హెలికాప్టర్ పైలట్ కూడా ఆయన మాట వినలేదు. దీంతో పొన్నాల లక్ష్మయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కిరాయికి తీసుకున్న నాలుగు సీటర్ల విటి - ఎస్వికె హెలికాప్టర్ పైలట్ ఆయననను మద్దూరు నుంచి వరంగల్కు తీసుకుని వెళ్లడానికి నిరాకరించాడు.
వరంగల్ జిల్లా జనగాం నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో సినీ నటి విజయశాంతితో కలిసి ఎన్నికల సభలో పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. సభలో పాల్గొనడానికి వారిద్దరు హెలికాప్టర్లో మద్దూరు వచ్చారు. సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్ను వరంగల్ తీసుకుని వెళ్లడానికి పైలట్ నిరాకరించాడు.
వరంగల్లో ఈ నెల 24వ తేదీన జరిగే రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పొన్నాల హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్లో లేనందున తాను వరంగల్కు రానని పైలట్ మొండికేశాడు. పైలట్పై దాంతో అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా అతను పట్టించుకోలేదు.
దాంతో పొన్నాల కారులో వరంగల్ బయలుదేరి వెళ్లారు. పొన్నాల లక్ష్మయ్య తన జనగాం నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగాం కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా, టిపిసిసి అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు మోయడం ఆయనకు కత్తి మీద సాముగానే ఉంది.