ఆ పేరు మార్చేస్తాం: కేంద్రానికి తెరాస హెచ్చరిక
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. తాము ఎన్టీఆర్ స్టేడియం పేరును మార్చాల్సి ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్లు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అధికారం చలాయించాలని చూస్తే.. ఇక్కడి విగ్రహాలను తొలగించాల్సి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ స్టేడియం పేరును మార్చాల్సి వస్తుందన్నారు.
కాగా, ఉన్న పేర్లు తొలగించుకునే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని, కమ్యూనిస్టులకు చెందిన విశాలాంధ్ర పత్రికను మన తెలంగాణగా, ప్రజాశక్తి దినపత్రికను నవ తెలంగాణగా తెస్తున్నట్లు తమకు చెప్పారని, ఇదీ ప్రస్తుత ఒరవడి అని, ఎన్టీఆర్ను అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదని, ఎన్టీఆర్ పేరు విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అంతకుముందు సభలో చెప్పిన విషయం తెలిసిందే.
విమానాశ్రయానికి ఇప్పుడున్న పేరు కూడా మాజీ ప్రధానిదేనని, ఆయన దేశం కోసం హత్యకు గురయ్యారని, విమానాశ్రయంలో ఇంటర్నేషనల్కు, డొమెస్టిక్కు వేర్వేరు పేర్లు ఉంటాయా? ఎన్టీఆర్ పేరును ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలకు పెట్టుకోవాలని, ఇక్కడ పెట్టడానికి ఇక్కడి వారి పేర్లు లేవా? మేం చరిత్రలేని వాళ్లమా? దిక్కు మొక్కు లేకుండా ఉన్నామా? ఈ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని తీర్మానం పెడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.
ఎన్టీఆర్ వల్లనే కేసీఆర్, జానారెడ్డి, జీవన్ రెడ్డి మరికొందరు కూడా రాజకీయంగా ఎదిగారు. గతంలో ఉన్న డొమెస్టిక్ టర్మినల్కు ఉన్న ఎన్టీఆర్ పేరును కొనసాగించకుండా కాంగ్రెస్ సర్కారు తప్పు చేసిందని, దేశంలో కేవలం ఒక్క ఇంటి నుంచే ఆయా పథకాలకు, సంస్థలకు 1500 వరకు పేర్లున్నాయని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు.
కానీ, ఎన్డీయే ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో విమానాశ్రయాలకు ఛత్రపతి శివాజీ, వల్లభాయ్పటేల్, జయప్రకాశ్ నారాయణ్, చరణ్ సింగ్ల పేర్లు పెట్టిందని, పేరు మార్చాల్సి వస్తే ఆ ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాల్సిందేనని, ఎన్టీఆర్ పేరును విజయవాడ, విశాఖ, రాజమండ్రి విమానాశ్రయాలకు పెట్టుకోవచ్చనని, అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్రం నుంచి ప్రధానిగా పనిచేసిన పీవీ పేరు పెడదామని, డొమెస్టిక్ టెర్మినల్కు తెలంగాణ ముఖ్యులు పేరు పెడదామని కిషన్ సూచించారు.