మహేష్ బాబు '1' సినిమాకు కోత మొదలైందా?
హైదరాబాద్: భారీ అంచనాలతో విడుదలైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే' సినిమాకు తొలి రోజు దర్శక, నిర్మాతలు ఊహించిన విధంగా ఆడియన్స్ నుండి మౌత్ టాక్ రాలేదని తెలుస్తోంది. సినిమా చూసిన పలువరు సెకండాఫ్లో కొంతభాగం బోరింగ్గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.
దీంతో ఆలోచనలో పడ్డ చిత్ర దర్శక నిర్మాతలు.....వేగవంతంగా డ్యామేజ్ నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో బోరింగ్గా ఉన్న సన్నివేశాలను ట్రిమ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అదే విధంగా గౌతం కృష్ణ కనిపించే సన్నివేశాల్లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు ఫస్ట్ షో నుంచి ట్రిమ్ చేసిన ఎడిషన్ను విడుదల చేస్తారట.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 స్క్రీన్లలో సినిమా విడుదలైంది. ఇంత వేగంగా, ఇన్ని థియేటర్లలో, సాయంత్రం ఫస్టాఫ్ మొదలయ్యే లోగా సినిమాను ట్రిమ్ చేసి ప్రేక్షకుల ముందుకు తేవడం సాధ్యమేనా? అనేది కూడా సందేహించ దగ్గ విషయమే. ఏది ఏమైనా నిర్మాతల ప్రయత్నం, తాపత్రయం చూస్తుంటే ప్రేక్షకులను సంతృప్తి పరచడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే..... సకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.