ఇటు షర్మిల పరామర్శ: అటు గులాబీ గూటికి ఎమ్మెల్యే?
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి, నాయకులకూ కార్యకర్తలకూ విశ్వాసం కల్పించడానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ షర్మిల తెలంగాణలో పరామర్శ యాత్ర చేస్తుండగానే పార్టీకి ఎదురు దెబ్బ తగులుతోంది. ఖమ్మం జిల్లా పినపాక శాసనసభ్యుడు, జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు తట్టాబుట్టూ సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.
పాయం వెంకటేశ్వర్లు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన టిఆర్ఎస్ నేతలు, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కెటి రామారావులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పాయం వెంకటేశ్వర్లును పార్టీలో చేర్చుకోవడానికి వారు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఆయన సన్నిహితులు కూడా పాయం వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నారని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గత ఎన్నికల్లో తెలంగాణలోని ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే ఉనికిని చాటుకుంది. మూడు శాసనసభా స్థానాలను గెలుచుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్పై గెలిచిన వైరా శాసనసభ్యుడు బానోతు మదన్లాల్ ఇప్పటికే టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అశ్వారావుపేట శాసనసభ్యుడు టీఆర్ఎస్లో చేరుతారని గతంలో ప్రచారం జరిగింది. అయితే, ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
పాయం వెంకటేశ్వర్లు టిఆర్ఎస్లో చేరితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో ఒక్క శాసనసభ్యుడు, ఒక పార్లమెంటు సభ్యుడు మాత్రమే మిగులుతారు. షర్మిల పరామర్శ యాత్ర పార్టీ బలోపేతానికి ఏ విధంగా పనికి వస్తుందో ప్రస్తుత పరిస్థితిలో తెలియడం లేదు.