వయసు 28 రోజులు.. బహుమతి రూ.24లక్షలు
దుబాయ్: నిండా నెల రోజులైన నిండని ఓ పాప ఏకంగా రూ. 24లక్షల బహుమతిని గెలుచుకుంది. ఆడపిల్ల పుడితే.. అదృష్ట లక్ష్మి ఇంటికొచ్చిందని కొందరు మురిసిపోతుంటారు. అది నిజమేనని ఈ ఘటనలో రుజువు చేసిందా చిన్నారి. ఆ పాప దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో బంఫర్ బహుమతి గెలుచుకొని ఆనందాల సిరులు కురిపించింది.
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అనీల్ జనార్ధనన్ 28 రోజుల తన కుమార్తె కోసం 20వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో శుక్రవారం నగలుకొన్నాడు. ఫెస్టివల్లో తన కుమార్తె నితేరా జనార్ధనన్ పేరు మీద మూడు కూపన్లను తీసుకున్నాడు.
కాగా, శనివారం ఆ షాపింగ్మాల్ విజేతలను ప్రకటించింది. లక్కీ డ్రాలో నితేరా పేరు మీద ఉన్న కూపన్కు 1,40,000 దిర్హామ్స్ విలువైన బంగారం, వజ్రాల నగలు బహుమతిగా లభించాయి. భారత కరెన్సీలో ఆ బహుమతి విలువ రూ. 24లక్షల వరకు ఉంటుంది.
దుబాయ్ షాపింగ్ పెస్టివల్ నిర్వహించిన అక్కీ డ్రాలో తమ కుమార్తెకు బహుమతి రావడం పట్ల ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ‘తన పేరు మీద మూడు కూపన్లు నింపి లక్కీడ్రాలో వేశాం. మాకు భారీ బహుమతి వచ్చిందని ఫోన్కాల్ వస్తే మొదట నమ్మలేదు. కానీ అది నిజమేనని స్పష్టకావడం ఆశ్చర్యం కలిగించింది' అని నితేరా తండ్రి జనార్దన్ తెలిపారు.
చిన్నారి నితేరా 28రోజుల బారసాలను కేరళలో నిర్వహించినట్టు ఆయన గల్ఫ్న్యూస్కు చెప్పారు. ఈసారి ఫెస్టివల్లో నితేరా జనార్దన్తోపాటు మరో భారతీయుడు లాజిస్టిక్ సూపర్వైజర్ బినాయ్ వర్ఘీస్ లక్కీడ్రాలో 11వేల దిర్హామ్లు (రూ. 1.87 లక్షలు) విలువచేసే బంగారు ఉంగరాన్ని గెలుచుకున్నాడు.