సంతకం లేదని సస్పెన్షన్, కేజ్రీపై అధికార్ల తిరుగుబాటు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదేశాల్ని ధిక్కరించారని ఆరోపిస్తూ ఢిల్లీలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. యశ్పాల్ గార్గ్ (ప్రాసిక్యూషన్ స్పెషల్ సెక్రటరీ), సుభాష్ చంద్ర (ప్రిసన్ స్పెషల్ సెక్రటరీ) అనే ఇద్దరు అధికారుల్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాలు పెంచేందుకు ఢిల్లీ కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వాటికి సంబంధించిన కొన్ని దస్త్రాలను లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే దస్త్రాలపై సంబంధిత అధికారులను సంతకాలు చేయాలని కోరింది.
అందుకు వారు నిరాకరించారు. సంతకాలు చేయలేదని వారి పైన సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ, అండమాన్ నికోబార్ క్యాడర్ కింద పని చేసే సివిల్ సర్వీసెస్ అధికారుల్ని సస్పెండ్ చేసే అధికారం కేవలం లెఫ్ట్నెంట్ గవర్నర్కు మాత్రమే ఉంటుంది.
దీంతో ఇప్పటికే కేంద్రంతో పలు వివాదాలు పెట్టుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి తాజా నిర్ణయం మరోసారి వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై అధికారులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
ఇద్దరు అధికారుల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ 200మందికి పైగా సివిల్ సర్వీసెస్ అధికారులు గురువారం విధులకు గైర్హాజరయ్యారు. అంతేకాదు, ఇలాగే వ్యవహరిస్తే తాము సామూహికంగా సెలవులు తీసుకుంటామని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.