సరదా: అమ్మ అని వెంకయ్య, కాదు అక్కనని రేణుక
న్యూఢిల్లీ: రాజ్యసభ మంగళవారం నాడు ఆసక్తికంగా సాగింది. సరదాగా మాట్లాడుకున్నారు. పంజాబ్లోని మోగాలో బస్సులోంచి తల్లీకూతుళ్లను తోసివేసిన ఘటన పైన వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరీ మధ్య సరదా సంభాషణ సాగింది. వారు అమ్మ, అక్క, అన్న అంటూ పిలుచుకున్నారు.
సభ ప్రారంభం కాగానే, మోగా ఘటనపై చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. ఈ సందర్భంగా వెంకయ్య దీన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, రాష్ట్రానికి చెందిన వారు కూడా తనను మాట్లాడనివ్వాలన్నారు. అయితే, రేణుకా చౌదరి... వెంకయ్య మాటలకు పదే పదే అడ్డు తగిలారు. అసలు ఆయన మా మాటలు వింటున్నారా అని నిలదీశారు.
దీంతో, వెంకయ్య వింటున్నామమ్మా అని బదులిచ్చారు. వెంటనే, రేణుక, సార్ నేను అక్కని అని బదులిచ్చారు. దీంతో వెంకయ్య, అమ్మ, అక్క పదాలకు అర్థాలను వివరిస్తూ... మనకు ఎవరి మీదనైనా ప్రేమ ఎక్కువైతే అమ్మా అని పిలుస్తామని, నేను నా మనవరాలిని కూడా అమ్మా అనే పిలుస్తానని, అందుకే అమ్మా అని పిలిచానని చెప్పారు.
ఈ సమయంలో సీపీఎం నేత సీతారాం ఏచూరి లేచి... వెంకయ్య అమ్మ, అక్కల మధ్య భేదాన్ని చక్కగా చెప్పారని,ఇప్పుడు నేను ఆయన్ను అన్నా అని పిలుస్తున్నానని, మరి అన్న తమ్ముళ్లు, చెల్లెళ్లు చెప్పేదాన్ని ఓపిగ్గా వినాలని చమత్కరించారు. దీనిపై రాజ్యసభ సభ్యులు చైర్మన్ స్పందిస్తూ.. సభ్యుల మధ్య అఫెక్షన్, గౌరవం రెండూ ఉండాలన్నారు.