ఎపి సిఐడి హల్చల్: చిక్కని కెటిఆర్ డ్రైవర్, గన్మన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, తెలంగాణ మంత్రి కెటి రామారావు డ్రైవర్కూ గన్మన్కూ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు బుధవారం రాత్రి హైదరాబాదులో హల్చల్ చేశారు. అయితే, నోటీసులు ఇవ్వకుండానే వారు వెళ్లిపోవాల్సి వచ్చింది. గతంలో చంద్రబాబు ఆడియో టేపులను ప్రసారం చేసిన టీ న్యూస్ చానల్కు అత్యుత్సాహంతో నోటీసులు ఇచ్చినట్లే ఇప్పుడు కేటీఆర్ డ్రైవర్, గన్మెన్లకు నోటీసులు ఇవ్వడానికి ఎపి అధికారులు ప్రయత్నించారు.
నోటుకు ఓటు కేసులో నిందితుడు మత్తయ్య ఫిర్యాదు మేరకు అని చెప్తూ కెటిఆర్ గన్మెన్ జానకీ రాం, డ్రైవర్ సత్యనారాయణకు బుధవారం రాత్రి సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ సీఐడీ బృందం, విశాఖ సీఐడీ బృందం హైదరాబాద్ వచ్చాయి. సీఎం క్యాంప్ కార్యాయలంలో కేటీఆర్ గన్మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు ఇచ్చేందుకు బుధవారం రాత్రి చేరుకున్నారు.
అయితే సీఎం క్యాంప్ కార్యాయలంలోకి అనుమతి లేదని, జానకీరాం, సత్యనారాయణ అనే పేర్లతో ఇక్కడ ఎవరూ పనిచేయడం లేదని బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు సీఐడీ అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అక్కడినుంచి వెనుదిరిగిన సీఐడీ బృందాలు నేరుగా బంజారాహిల్స్లోని కేసీఆర్ పాత ఇంటికి చేరుకున్నారు.
అక్కడ కూడా ఆ పేర్లతో ఎవరూ పనిచేయడం లేదని సమాధానం రావడంతో విజయవాడ సీఐడీ బృందం వెనుతిరిగింది. మరోవైపు విశాఖనుంచి వచ్చిన సీఐడీ బృందం పీఎస్ ప్రకాష్ పేరుతో ఇక్కడ ఎవరైనా పనిచేస్తున్నారా? అంటూ బందోబస్తులో ఉన్న అధికారులను అడిగింది. అలాంటి వారు ఎవరూ లేరని చెప్పడంలో ఆ బృందం కూడా తిరిగి వెళ్లిపోయింది.
విజయవాడ బృందానికి నేతృత్వం వహిస్తున్న డీఎస్పీ షావలీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాము కేటీఆర్ గన్మెన్తో పాటు డ్రైవర్కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. విశాఖ సీఐడీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ - తాము కేటీఆర్ పీఎస్ ప్రకాశ్ అనే వ్యక్తితో పాటు మరో గన్మెన్కు నోటీసులిచ్చేందుకు వచ్చామని తెలిపారు. దీనితో రెండు బృందాలుగా వచ్చిన అధికారులు మొత్తం నలుగురికి నోటీసులిచ్చేందుకు వచ్చినట్టు స్పష్టమైంది.
ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయానికి వెళ్లిన ఏపీ బృందాలు అక్కడి విభాగపు ఉన్నతాధికారులతో మాట్లాడి, వెనుదిరిగాయి. ఓటుకు నోటు కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరూసలేంను బెదిరించారన్న ఆరోపణలపై తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. శుక్రవారం సాయంత్రం 5గంటలోపు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఉన్నట్లు సమాచారం.