జూ. ఎన్టీఆర్తో కోడెల: బాబు మళ్లీ చేరదీస్తున్నాడా?
హైదరాబాద్: తన నియోజక వర్గమైన సత్తెనపల్లికి రావాలంటూ జూ. ఎన్టీఆర్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆహ్వానించారు. ఇదేంటి లండన్లో ఉన్న ఎన్టీఆర్ను కోడెల ఎలా ఆహ్వానించాడని అనుకుంటున్నారా?
ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ తన కొత్త సినిమా షూటింగ్ కోసం లండన్లో ఉన్న సంగతి తెలిసిందే. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఓ సదస్సులో పాల్గొనేందుకు కోడెల శివప్రసాద రావు, ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ, మరికొంత మంది ప్రతినిధులతో కలిసి లండన్కు వెళ్లారు.
షూటింగ్ నిమిత్తం అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లి రావాలని కోడెల జూ. ఎన్టీఆర్ను ఆహ్వానించారు. ఎన్టీఆర్, చిత్ర బృందం సభ్యులు ఆయన్ను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా సత్తెనపల్లిలో మరుగుదొడ్ల నిర్మాణం, శ్మశానాల ఏర్పాటు తదితరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రావాలని జూనియర్ ఎన్టీఆర్ను కోడెల ఆహ్వానించారు. కోడెల ఆహ్వానాన్ని మన్నించిన జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే సత్తెనపల్లి వస్తానని చెప్పాడని తెలిసింది.
అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు, జూనియర్ ఎన్టీఆర్ను కలవడం పట్ల బాబు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ను చేరదీస్తున్నాడనే ఊహాగానాలు రాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకున్నాయి. సీఎం చంద్రబాబు అనుమతి లేకుండా జూనియర్ను స్పీకర్ కలుస్తాడా? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2009 సాధారణ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రమాదం జరగడంతో మధ్యలోనే తన ప్రచారాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోవడం తదితర విషయాలను మనం చూశాం.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టారు. అందుకు కారణం తన కుమారుడు నారా లోకేశ్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకేనని మీడియాలో వార్త కథనాలు కూడా వచ్చాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత జూనియర్ ఎన్టీఆర్ను కలవడంతో చంద్రబాబు జూనియర్ను మళ్లీ చేరదీస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుతున్నాయి.