కృష్ణుడిగా భావించి సాయి చుట్టూ గోపికల్లాగా..
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారం బాబు కుమారుడు నారయణ్ సాయికి బెయిల్ ఇవ్వకూడదని కోర్టును కోరుతూ గుజరాత్ ప్రభుత్వం అతనిపై గమ్మత్తయిన వ్యాఖ్యలు చేసింది. తల్లి శస్త్రచికిత్సకు వైద్యులు తేదీని నిర్ధారించేవరకు నారాయణ సాయికి బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
"మీ క్లయింట్ చాలా మంది ప్రజలకు రోగాలు నయం చేస్తున్నాడు. అతను తన తల్లికి కూడా చికిత్స చేయగలడు" అని కోర్టు సాయి తరఫు న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
సాయికి బెయిల్ ఇవ్వకూడదంటూ గుజరాత్ ప్రభుత్వం కోర్టులో వాదించింది. తెలివి తక్కువ మహిళలు అతన్ని శ్రీకృష్ణ భగవానుడిగా భావిస్తారని, అది తిరిగి అతన్ని జైలుకు తీసుకురావడంలో ఇబ్బందులు తెచ్చి పెడుతుందని వ్యాఖ్యానించింది. సాయి చాలా పాపులర్ వ్యక్తి అని, తెలివి తక్కువ మహిళలు అతన్ని కృష్ణుడిగా భావించి అతని చుట్టూ గోపికల మాదిరి నృత్యాలు చేస్తారని గుజరాత్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
"ఇది గుజరాత్లో కూడా జరుగుతోందా, కొన్ని గిరిజన ప్రాంతాల్లో అటువంటిది జరుగుతోందంటే నమ్మవచ్చు కానీ అభివృద్ధి చెందిన గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా అటువంటిది ఉంటుందా?" అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
నారాయణ సాయి తల్లికి శస్త్ర చికిత్స చేసే తేదీని వైద్యులు నిర్ధారించిన తర్వాతనే అతని బెయిల్ ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలులోకి వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆశారాం బాపు, అతని కుమారుడు నారాయణ సాయి జైలులోని ఉన్నారు.
ఆశారాం బాపు 2013 ఆగస్టు నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. పాఠశాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణపై ఆశారాం బాపు అరెస్టయ్యాడు. గుజరాత్లోని సూరత్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారని ఆశారాం బాపుపై, అతని కుమారుడు నారాయణ సాయిపై కేసు నమోదైంది.