టిడిపి ఆవిర్భావంలోనే దోషం: అందుకే బాబుకిలా..
విజయవాడ: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో చిక్కుల్లో పడడంతో జ్యోతిష్కులు విజృంభిస్తున్నారు. తాజాగా ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ కాళిదాస్ శర్మ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ముహూర్తమే బాగా లేదని తేల్చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడారు.
టిడిపి ఆవిర్భావ దినోత్సవం 1982 మార్చి 29న కృత్తిక నక్షత్రం తృతీల తరుణం కర్కాటక లగ్నంలో జరిగిందని, ఆ ముహూర్తం ప్రకారం కాలచక్ర ప్రశ్నానుసారం నాయకులకు గ్రహ ప్రభావం ఉంటుందని అన్నారు. రాహువు, బుధ గ్రహాల ప్రభావంతో నిత్యం పార్టీకి, నాయకుడికి సమస్యలు తలెత్తుతాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరీ దేవి పిఎ కారణంగా మే 10 నుంచి జూన్ 27వ తేదీ వరకు పార్టీకి గడ్డు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్లు ఆయన అ న్నారు. ఈ దోషానికి పరిష్కార మార్గం సూచించినా పట్టించుకోకపోవడం ఇబ్బందులు తలెత్తాయని ఆయన చెప్పారు.
బుధుడు, రాహువుల కారణంగానే ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావుకు గుండె శస్త్రచికిత్స, నాదెండ్ల భాస్కరరావుకు రాజకీయ చిత్ర దోషం ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. అదే విధంగా చంద్రబాబుకు అలిపిరి సంఘనట జ్యేష్ఠ నక్షత్రంలో బుధ గ్రహ ప్రభావంతోనే జరిగిందని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ గ్రహ ఫలితాలను నమ్మేవారని, అందువల్లనే నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తాన్ని నాటకీయంగా ఆలస్యం జరిగేలా జాగ్రత్త వహించారని, దీంతో నెల రోజుల్లోనే నాదెండ్ల భాస్కర రావు పదవిని కోల్పోయారని ఆయన అన్నారు.
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం కారణం కాదని, అది పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉన్న దోషం వల్లనే జరుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహ్రూర్తాన్ని నిర్ణయించింది ఈ కాళిదాస్ శర్మనే కావడం గమనార్హం