శివుడే ముస్లీంల తొలి దైవం: ముఫ్తీకి రాందేవ్ మద్దతు
మధుర: జమైత్ ఉలేమా అధిపతి, ముస్లీంల మతగురువు ముఫ్తీ మొహమ్మద్ ఇల్యాస్ చేసిన వ్యాఖ్యల పైన యోగా గురువు రామ్ దేవ్ బాబా శనివారం స్పందించారు. ముఫ్తీ వ్యాఖ్యలు సరైనవేనని చెప్పారు. ఆయన నిజమే చెప్పారని తెలిపారు.
జమైత్ ఉలేమా అధిపతి చెప్పినట్టుగా ముస్లీంలకు తొలి ప్రవక్త శివుడే అన్నారు. హిందు దేవతల గురించి ఇల్యాస్ నేర్చుకుంది, చెప్పింది అక్షర సత్యమన్నారు. దాంట్లో ఏ తప్పూ లేదని తెలిపారు. ఆయన సోదరభావాన్ని చాటిచెప్పే ఉదాహరణ అన్నారు. ఖురాన్ కన్నా వేదాలే ముందు పుట్టాయన్నారు. అవి భారతావనికి పురాతన శాసనాలని, వేదాలను ప్రపంచం మొత్తం గౌరవిస్తోందన్నారు.
కాగా, ముస్లీంల తొలి దైవం పరమశివుడేనని, ముస్లీంలు అందరు ఒకప్పుడు సనాత ధర్మాన్ని పాటించేవారని జమైత్ ఉలేమాకు చెందిన మతగురువు ముఫ్తీ మొహమ్మద్ నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మనలను సృష్టించింది ఆది దంపతులు శివపార్వతులే అన్నారు.
తాము భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడాన్ని వ్యతిరేకించమని చెప్పారు. చైనా, జపాన్లో నివసిస్తున్న వారిని ఎలాగైతే చైనీయులు, జపనీయులు అంటామో.. అలాగే భారత దేశంలో మనల్ని హిందుస్తానీ అనవచ్చునని వ్యాఖ్యానించారు.
జమైత్ ఉలేమాకు చెందిన పలువురు మత నాయకులు అయోధ్యను సందర్శించారు. ఈ నెల 27వ తేదీన జరిగే మత హింస వ్యతిరేక సదస్సుకు హాజరు కావాలని పలువురు సాధువులను వారు కోరారు. వారు బుధవారం అయోధ్యలో పర్యటించారు.