భాను కిరణ్తో మద్దెలచెర్వు సూరి భార్య రాజీ?
అనంతపురం: భాను కిరణ్ చాలా మందికి గుర్తుండే ఉంటాడు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో అతను ప్రధాన నిందితుడు. చాలా కాలంగా అతను జైల్లోనే ఉంటున్నాడు. బెయిల్ కోసం కూడా దరఖాస్తు పెట్టుకోవడం లేదు. అయితే, తాజాగా భాను కిరణ్కు సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. దక్కన్ క్రానికల్ అనే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసిన ఓ వార్తాకథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భాను కిరణ్, మద్దెలచెర్వు సూరి భార్య భానుమతి మధ్య రాజీకి ప్రయత్నాలు సాగుతున్నట్లు ఆ పత్రిక రాసింది. ఈ డీలో కోట్లలో ఉన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. రాజీ ఫార్ములాను కొంత మంది నాయకులు ఇటీవల ఇరు పక్షాల ముందు పెట్టినట్లు సమాచారం.
మద్దెలచెర్వు సూరి అలియాస్ గంగుల సూర్యప్రకాష్ రెడ్డిని హైదరాబాదులో మూడేళ్ల క్రితం కాల్చి చంపినట్లు భాను కిరణ్ ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. అనంతపురానికి చెందిన భాను కిరణ్ సూరి పేరు మీద పలు దందాలు నడిపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కారు బాంబు పేలుడు కేసులో సూరి జైల్లో ఉన్నప్పుడు భాను కిరణ్ ఆ దందాలు చేసినట్లు చెబుతున్నారు
మూడేళ్లుగా భాను కిరణ్ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటున్నాడు. ప్రత్యర్థులకు భయపడి భాను కిరణ్ బెయిల్ దరఖాస్తు కూడా పెట్టుకోవడం లేదని అంటున్నారు. పరిటాల రవి కుటుంబానికి, మద్దెలచెర్వు సూరికి మధ్య తీవ్రమైన శుత్రత్వం ఉండేది. ఇరువురు కూడా మరణించడంతో ఆ శత్రుత్వం ఇప్పుడు కనుమరుగైంది.
భానుమతితో రాజీ కుదిరితే భాను కిరణ్ బెయిల్కు దరఖాస్తు చేసుకుంటాడని అంటున్నారు. భాను కిరణ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద యెత్తున ఆస్తులు కూడగట్టినట్లు ప్రచారం సాగుతోంది. రాజీ కోసం రాయలసీమకు చెందిన కొంత మంది నాయకులు, తెలంగాణకు చెందిన యువనేత సూరి కుటుంబసభ్యులను కలిసి రాజీ ఫార్ములాను ముందు పెట్టినట్లు సమాచారం. సోదరుడిలా చూసుకుంటే భాను కిరణ్ తమనే మోసం చేశాడని భానుమతి ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎలా తేలుతుందనేది చూడాల్సిందే.