2కిమీ ఈడ్చుకెళ్లి దొంగను చంపిన దున్నపోతు
ఆగ్రా: దున్నపోతుని దొంగతనం చేసేందుకు వచ్చి ఓ దొంగ తన ప్రాణాన్నే కోల్పోయిన సంఘటన ఆగ్రాకు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నాగ్లామణి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆదివారం రాత్రి ఓ దొంగ నాగ్లామణి గ్రామంలోని సత్యప్రకాశ్కు చెందిన దున్నపోతును దొంగిలించడానికి వచ్చాడు. కొత్త వ్యక్తిని చూసిన దున్నపోతు అమాంతం అతనిపై పడి రక్తం వచ్చేలా కుమ్మి, సుమారు రెండు కిలోమీటర్ల మేర గ్రామంలోని పొలాల్లోకి ఈడ్చుకెళ్లింది.
దున్నపోతు కుమ్మడంతో దొంగ ఛాతిపై పైభాగం.. తల, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలై, పొలాల్లోనే మరణించాడు. అయితే మరణించిన వ్యక్తి ఎవరేనిది ఇంకా గుర్తించలేదని తెలిపారు. దొంగ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఎప్పటిలాగే సోమవారం ఉదయాన్నే లేచిన సత్యప్రకాశ్ తన ఇంటి వద్ద గుమికూడిన జనాన్ని చూసి ఏమైందని అడగ్గా... ఆదివారం రాత్రి జరిగిన విషయాన్ని గ్రామస్ధులు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దొంగను చంపిన దున్నపోతుని చూసేందుకు సమీపంలోని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఫిరోజాబాద్కు చెందిన ఓ రైతు దున్నపోతుని చూసి యమరాజ్ వాహనమైన దున్నపోతు లాగే ఈ దున్నపోతు ఉందని కీర్తించాడు.