ఓటుకు నోటు: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోచింగ్...!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే నిందితులు, సాక్ష్యులను తెలుగుదేశం పార్టీ కార్యలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముందస్తు కోచింగ్ ఇస్తున్నారనే వార్తలు మీడియాలో ఊపందుకున్నాయి.
విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు వేసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానమివ్వాలని అన్న అంశంపై న్యాయవాదుల బృందం వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఒకే విధమైన సమాధానాలు చెప్పడం చూసి విస్తుపోయారు.
అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నుంచి మంగళవారం విచారణకు హాజరైన శ్రీనివాసులు నాయుడు దాకా చెప్పిన సమాధానాల్లో చాలా అంశాలు అధికారులను అవాక్కయ్యేలా ఉన్నాయని ఏసీబీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ రూ. 50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం, స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు బయటపడటంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
విచారణకు వారు సహకరించకుండా ఉండేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఓ 'ముఖ్యనేత' నేతృత్వంలో కొందరు ప్రముఖులు ఒక కమిటీ వేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కమిటీలో నిష్ణాతులైన న్యాయవాదులతో పాటు పలువురు మాజీ, ప్రస్తుత పోలీసు ఉన్నాతాధికారులు ఉన్నట్లు అనుమానిస్తోంది.
ఆయా కమిటీ ఆధ్వర్యంలోనే విచారణకు హాజరయ్యే వారందరికీ, ఏసీబీ వద్ద ఎలా వ్వవహరించాలో సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ తర్ఫీదు ఇస్తున్న వారు ఎవరనే విషయంపై తెలంగాణ ఏసీబీ దృష్టి పెట్టింది.