వరదలు: ఫ్యామిలీ సేఫ్ అని తెలిసి అశ్విన్ ఫిఫ్టీ
న్యూఢిల్లీ: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై వరదలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరదల్లో తనవారు ఎలా ఉన్నారో తెలియక అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడట. మురళీ విజయ్ కూడా అక్కడికి చెందినవాడే. దక్షిణాప్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు సరీస్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా విజయ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు.
రహనేతో కలిసి అశ్విన్ బ్యాటింగ్కు దిగడానికి ముందు ఆయన భార్య ట్వీట్ చేశారు. గత 24 గంటలుగా తన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారనే విషయం తెలియడం లేదని ఆమె ట్వీట్ చేసింది. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని తెలిసిన అశ్విన్ దక్షిణాఫ్రికాపై అర్థ సెంచరీ చేశాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికి తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు అశ్విన్ భార్య పృథ్వీ అశ్విన్ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు ఆమెకు వాట్సప్ సమాచారం అందింది. ఆ వాట్సప్ మెసేజ్ పంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకోవాలని అనిపిస్తోందని ఆమె ట్వీట్ చేశారు.
వరదల్లో చిక్కుకున్నవారి కోసం ఎంతో మంది ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారని, మ్యాచ్ పూర్తయిన తర్వాత తాను కడా చెన్నై చేరుకుని తగిన సాయం అందిస్తానని అశ్విన్ చెప్పాడు. తాను కూడా కొంత కాలంగా చెన్నైలో ఉంటున్నానని, ఇంతకు ముందు ఇటువంటి వరదలు చూడలేదని మురళీ విజయ్ అన్నాడు.