ప్రపంచ కప్: గెలిస్తే తుపాకితో సంబరం, గాయాలు
కాబుల్: ఐసీసీ ప్రపంచకప్ 2015లో పసికూలుగా భావిస్తున్న జట్లు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఐర్లాండ్, యూఏఈ, ఆప్ఘనిస్తాన్.. ఇలా చిన్న జట్లు స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడుతున్నాయి. గురువారం నాడు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆప్ఘనిస్తాన్ చారిత్రక విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఆప్ఘన్లో పలుచోట్ల రోడ్ల పైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. గురువారం స్కాట్లాండు పైన ఒక వికెట్ తేడాతో తమ జట్టు గెలవగానే.. ఆప్ఘన్ సంబరాల్లో మునిగిపోయింది. యువత జాతీయ జెండాలతో వీధుల్లోకి వచ్చి డ్యాన్స్ చేశారు.
అయితే, దేశంలో చాలా ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు తుపాకులతోనే ఆనందాన్ని పంచుకోవడం గమనార్హం. జలాబాదులో తుపాకులను గాల్లోకి పేల్చి ఆనందించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. కాగా, చాలాచోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. ద్విచక్రవాహనాలు, కార్లలో వచ్చి సంబరాలు చేసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
మరోవైపు, ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు వణికిస్తున్న విషయం తెలిసిందే. ఆప్ఘన్ నిత్యం తాలిబన్లతో పోరాడుతోంది. ఆప్ఘన్ యువత గెలుపు సంతోషం చూస్తుంటే.. యువత తీవ్రవాదానికి నో చెబుతూ.. క్రికెట్కు యస్ చెబుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. పలువురు ట్విట్టర్లో స్పందించారు.
ఆప్ఘన్ గెలుపు పైన భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. పాత విండీస్ జట్టులా.. ఆప్ఘన్దీ సహజ సిద్ధమైన ఆట అన్నాడు. వాళ్లన వాళ్లలాగే ఆడనివ్వాలన్నాడు. సాంకేతికతను మొత్తంగా వారి పైన రుద్దవద్దని, మ్యాచులో వాళ్లు పోరాడిన తీరు అద్భుతమన్నాడు. ఈ విజయంతో ఆప్ఘన్ చిన్నారుల్లో చాలామంది కచ్చితంగా బ్యాట్ పట్టుకోవడం మొదలు పెడతారన్నాడు.