ఆస్టేలియన్ ఓపెన్: సైనా ఓటమికి కారణం అదే?
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో ప్రపంచ నెంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ ఓటమికి కారణం ఓ ఇండియన్ రెస్టారెంట్ అని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కోచ్ విమల్ కుమార్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే, సైనా ఓటమికి ఫుడ్ పాయిజనింగే కారణమని ఆమె కోచ్ విమల్ కుమార్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరిస్ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్రత్యర్థి షిజియాన్ వాంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
గతేడాది జరిగిన ఇదే టోర్నీ సెమీస్లో ఆమె పైనే విజయం సాధించింది. ఫైనల్లో కరోలినా మారిన్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మ్యాచ్కి ముందు సిడ్నీలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో తిన్న ఆహారం సైనా ఆటపై ప్రభావం చూపిందని కోచ్ విమల్ కుమార్ చెప్పారు.
ఆహారం బాగాలేదని, దాని వల్ల పుడ్ పాయిజనింగ్ జరిగి సైనా కోర్టులో సరిగ్గా కదలలేకపోయిందని, అందువల్లే పరాజయం పాలైందని ఆయన పేర్కొన్నారు. ఇక, త్వరలో జరగనున్న ఇండోనేసియా ఓపెన్కు సైనా సన్నద్ధమవుతోంది.
జకార్తాలో జరిగే ఈ టోర్నమెంట్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ మరో తెలుగు తేజం పివి. సింధుతో పోటీ పడే అవకాశం ఉంది.