13 ని.లు ఎక్కువ మోడీ, 120 కోట్ల భారతీయుల కోసం
న్యూయార్క్: ఐక్య రాజ్యసమితి సభ సమావేశంలో శుక్రవారం నాడు సుస్థిర అభివృద్ధి పైన ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణీత సమయం కంటే పదమూడు నిమిషాలు ఎక్కువగా మాట్లాడారు. మోడీ ప్రసంగించిన తర్వాత ఐరాస సాధారణ సభ అధికారి దీనిపై ఓ వ్యాఖ్య చేశారు.
ఆయన వ్యాఖ్యతో సభలో కరతాళ ధ్వనులతో పాటు నవ్వులు విరిశాయి. ప్రధాని మోడీ తన సమయం కంటే 13 నిమిషాలు అదనంగా తీసుకోవడంపై సదరు ఐరాస అధికారి మాట్లాడుతూ...
'భారత ప్రధాని మోడీకి ధన్యవాదాలు. 120 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రధాని 13 నిమిషాలు అదనంగా తీసుకున్నారు. ఒక్కో నిమిషాన్ని సగటున 10 కోట్ల మంది భారతీయులకు కేటాయించి ఉంటారు' అని చెప్పారు.
మాకు అర్హత ఉంది: ప్రధాని మోడీ
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం పొందటానికి తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ ప్రకటించాయి. ఈ దిశగా భద్రతామండలిని నిర్దేశిత కాలవ్యవధిలోపు సంస్కరించాలని పునరుద్ఘాటించాయి.
నాలుగుదేశాలతో కూడిన (గ్రూప్-4)సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం న్యూయార్క్లో ఆతిథ్యం ఇచ్చారు. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలామెర్కెల్, జపాన్ ప్రధాని షింజోఅబె, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ హాజరైన ఈ సదస్సును ఉద్దేశించి మోడీ మాట్లాడారు.
ఐరాస భద్రతామండలి మరింత విశ్వసనీయతను, న్యాయబద్ధతను కలిగి ఉండాలంటే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాలకు, అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు ప్రధాన ఇంజిన్ల వంటి దేశాలకు, ప్రధాన భూఖండాలకు చెందిన అభిప్రాయాలకు స్థానం కల్పించాలన్నారు.
ప్రపంచ బాధ్యతలను స్వీకరించటానికి నాలుగు దేశాలూ సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐరాస ఇప్పటికీ గత శతాబ్దపు మానసికస్థితిలో ఉందని, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి కొత్త సమస్యలకు అనుగుణంగా మారలేదని మోడీ విమర్శించారు.
భద్రతామండలిలో సంస్కరణలు అనే అంశంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నా.. దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఆ విషయంలో ప్రగతి లేదన్నారు. ఐరాస ఆవిర్భవించినప్పటికీ ఇప్పటికీ సభ్యదేశాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని, శాంతి, భద్రతకు ఎదురయ్యే సవాళ్లు సంక్లిష్టంగా, ఊహించలేని విధంగా తయారయ్యాయన్నారు.
మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నామని, కొత్త అభివృద్ధి ఇంజిన్లు, మరింత విస్తారమైన ఆర్థికశక్తులు, ఆర్థిక అంతరాలతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మారిందని మోడీ చెప్పారు. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవటం ద్వారానే ఐరాస మరింత ప్రాతినిధ్యంతో కూడిన సంస్థగా, మరింత ప్రభావవంతంగా తయారవుతుందన్నారు.
సంస్కరణలు చేపట్టాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంటే ఇటీవల కదలిక మొదలైందని పేర్కొంటూ.. ఐరాస ప్రారంభించిన చర్చల ముసాయిదాను గుర్తు చేశారు. ఐరాస 70వ సర్వసభ్యసమావేశం సందర్భంగా ఈ చర్చలను వాటి తార్కిక ముగింపు వైపు తీసుకెళ్లాలన్నారు.